శ్రీ లల్ల పదాలు.
14 వ శతాబ్దంలో కాశ్మీరాలలో లల్ల పుట్టింది. అమెకు పుట్టింది మొదలు ఆత్మాన్వేషణమే పని. ఆమెతో ప్రాచీన కాశ్మీరంలో కవిత్వం పుట్టింది. ఈమె కవితల్లో శివాద్వైతం, అద్వైతం , తంత్రం, ప్రత్యభిజ్ఞ, సూఫీ సంప్రదాయం మొదలగువానిలో చిలికిన వెన్న గీయని సున్నా కనిపిస్తాయి.
తత్త్వద్వేషులు వీనినే లల్లాయి పదాలను అన్నారా లేక తెలుగునాట నిజంగానే మరో ల(లొ)ల్లయ్య చెప్పిన పదాలనే ఇలా అన్నారా సంశయం ఇప్పటికీ అలానే ఉంది.
ఈమె పద్యాలను శ్రీమదభినవగుప్తుడు ఈశ్వర ప్రత్యభిజ్ఞా వ్యాఖ్యాన భాస్కరుడు ” లల్లేశ్వరీ వాక్యాని” అనే పేరుతో సంస్కృతంలో శ్లోకాలుగా మార్చాడు. ఈమెకు హిందువులలో లల్ల, లల్లాదేవి, లల్లేశ్వరి, లల్లాయోగిని అనీ, ముస్లిములలో లల్లా అరీల్రీఫా అనీ పేర్లున్నాయి.
ఆమె పదాలను శ్రీ వేలూరి శివరామ శాస్త్రిగారు తెనిగించారు వచనంలో.
అవి 1958 ప్రాంతంలో “నవ భారతి ” పత్రికలలో ప్రచురింప బడ్డాయి.
కొన్ని లల్ల పదాలు.
నేను అబలను. నన్ను భవరోగం పట్టుకొని పీక్కుతింటోంది.
శివుడు, కేశవుడు, జినుడు- బ్రహ్మ వీరిలో ఎవరు నాకు చికిత్స చేసినా సరే-
నేను విభుని కోసం దేశదేశాలు తిరిగి వేసారిపోయాను. పొరబాటుపడ్డాను.
ఊపిరి నిలిపి, జ్ఞానదీపం వెలిగించి చూతునుగదా
తీరా ఇంట్లోనే చిత్స్వరూపుడు కనబడ్డాడు.
విభుని దర్శనంకోసం ఎన్నో తీర్థాలు తిరిగాను.
అతని గుణాలు కీర్తించికీర్తించి నోరు నొచ్చింది. దానికంటె మనస్సు మలమల మరిగింది.
అతని విమర్శ చేస్తూ లోనికి వెళ్లా.
అక్కడ అన్నీ ఆవరణాలే. అతను లోపలనే ఉంటాడని నిశ్చయించా. తోసుకుని లోపలికి వెళ్లా.
అపుడందరూ లల్లా లల్లా అన్నారు.
సంసారంలో కుమిలి దిక్కులేనిదానినైనాను. ఇప్పుడు సహజమైన ప్రబోధం కలిగింది.
ఒకరికోసం నేను మరణించక్కర లేదు. నాకోసం మరొకరు చావక్కరలేదు.
నాకిపుడు చావు బ్రతుకూ ఒక్కటే.
ముక్తికోసం పాపం ఈ సన్యాసులు తీర్థాలు పోతారు.
ముక్తి చిత్తసాధ్యంకాని తీర్థసాధ్యం కాదు.
దూరపుకొండలు నునుపు.
చిత్తం అనే అద్దం నిర్మలమైనది. ప్రత్యభిజ్ఞ కలిగింది.
దైవం నా స్వరూపంగానే కనిపించింది.
నేనూ హూష్ – నీవూ హూష్. ఈ ప్రపంచమూ హూష్.
అమ్మలక్కలు నన్ను వేవిధాల తిట్టనీ,
ఉదాసీనమైంది నా మనసు. దానికి మకిలి పట్టదు.
ఉదాసీనమైన ( పైన వ్రేలాడదీసిన) అద్దాన్ని
( నేలమీది) దుమ్ము ఏం చేస్తుంది?
నన్ను తిట్టుకోండి, తిమ్ముకోండి.
పూలతో పూజించుకోండి, రాలతో కొట్టుకోండి.
నాకు దుఃఖమూలేదు, సంతోషమూ లేదు-
బోధామృతం తాగి నాలో నేనున్నా..
శీలాన్నీ మానాన్నీ కాపాడటానికి శీలమానాలే భటులు . ( కాని, నీవా.? నేనా?)
గాలిని ఏ మొనగాడైనా పట్టుకుంటాడా?
ఏనుగు నెవడైనా దారంతో కట్టివేస్తాడా?
అంతా తెలిసి మొద్దులా ఉండు; అంతా విని చెవిటివి కా;
అంతా చూసి గ్రుడ్డి వవు – ఇదే తత్వాభ్యాసం.
అభ్యాసం చేత దృశ్యం శూన్యమైతే సాక్షిరూపం మిగులుతుంది.
శాంతమైన ఆ సాక్షిన్నీ శూన్యమైతే ఇక అనామయం.
వాక్కూ మనస్సూ శివుడూ శక్తీ – సమస్తమూ
దేంట్లో లయమైతే అదే – అభ్యాసం.
తంత్రమంతా మంత్రంలో,
నాదమూలమైన మంత్రమంతా చిత్తంలో లయమవుతుంది.
చిత్తం లయమయితే
దృశ్యమూ ద్రష్టా కూడ చిత్ స్వరూపంగా శేషిస్తుంది.
సూర్యుడు అస్తమిస్తే చంద్రుని వెలుగు. చంద్రుడు అస్తమిస్తే చిత్తం వెలుగు.
చిత్తం అస్తమిస్తే దృశ్యజాతమంతా ఎందులో లీనమౌతుంది?
నీ వెవరో తెలియదు. నే నెవరో తెలియదు.
నీతో ఐక్యమూ తెలియదు ,
దేహమే నేనని అనుకోవడం వల్ల –
” నీ వెవరు? నే నెవ్వరు?” అని సంశయం
శివుడు గుఱ్ఱం. కేశవుడు జీను. ఆత్మ-భవుడు లాడాలు.
తగిన రౌతు ఎవడో నాకు చెప్పు.
అప్పుసొప్పులు తీర్చుకోవడం ఒక తీర్చుకోవడం కాదు.
తిండి బట్టల భ్రమ తీర్చుకోవాలి.
చలికిమాత్రం గుడ్డ. ఆకలికిమాత్రం కూడు.
సహజస్థితిలో భేదం అనేది కలికానికి కూడా కానరాదు.
బయటలో బయలు కలిసినటుల కలిసిపోవడం సహజస్థితి.
ఒకానొకడు నిదురపోతైనా జాగరూకుడే!
ఒకడు జాగరూకుడైనా నిదురపోతే;
ఒకానొకడు ఆడంటు ఐనా పవిత్రుడే.
ఒకడు స్నానం చేసినా అశుచే .
ద్వాదశాంతంలో తానే గుడి కట్టిన దేవళంలో కూచుని
ప్రాణసూర్యుణ్ణి ప్రరోచనచేసి శంకరుడైపోయే వా డిక
ఎవరిని పూజిస్తాడు?
ఓ యోగీ! నీకు జలస్తంభన ఎందుకు? అగ్నిస్తంభన ఎందుకు?
ఆకాశగమనం ఎందుకు? కొయ్యావు పాలు పిండడ మెందుకు?
ఇదంతా బడాయి కాదా?
ఏ దిక్కున ఏ దారిని వచ్చానో
మళ్లా ఏ దారిని పోతానో తెలియదు.
ఉచ్ఛ్వాసమే నాకు ధైర్యం.
ఓ ప్రభూ! నీకూ ఆరు. నాకూ ఆరు.
నీవు ఏలికవు. నేను వెంకను – ఇదే తేడా.
అయ్యా! దేహాదులైన ఆరు కోశాల అడ్డువల్ల
నిన్ను కానక దుఃఖ పడ్డాను. ఇపుడో ఉపాధి బద్దలయింది.
విశ్రాంతి దొరికింది.
ఒజ్జా! నాకిది చెప్పు –
హాహ్, హూహ్ , రెండూ అన్యమతాలే కదా!
హాహ్ వేడిగా ఉండడమేం?
హూహ్ చల్లగా ఉండడమేం?
హాహ్, జఠరాగ్నితప్తమై
నాభి దగ్గరనుంచి వస్తుంది.
హూహ్, ద్వాదశాంతం నుంచి పుడుతుంది.
హాహ్ ప్రాణం, హూహ్ అపానం.
లల్ల పత్తికాయలాగ జీవితం ఆరంభించింది. అది వికసించేసరికి దాన్ని కోశారు.
ఒకరు పింజతీశారు.ఒకరు ఏకారు. ఒకరు వడికారు. ఒకరు ఉతికారు.
ఒకరు మగ్గంలో పెట్టి అటూఇటూ కొట్టారు.
ఒకరు కత్తిరించారు. ఒకడు కట్టాడు.
అమ్మయ్య! అంతటితో దీనికి విముక్తి! జీవుడిదారి ముండ్లడొంక!
నన్ను నేను తెలుసుకోడానికి శ్రమపడి ప్రాణాయామాదులతో అలసి అలసి, అతివిజనమైన జ్ఞానమార్గంలో నడచి నడచి ఆనందసురాగృహం చూళాను.
అక్కడ ఉన్నవన్నీ నిండుకుండలే.
ఎవడుకాని ఈ కల్లుపాక చేరీ, తాగకుండా పోతే పోనీ, వాడి ఖర్మం!